ఏపీకి ఇంకేం ఇవ్వం…తేల్చేసిన కేంద్రం !

central government About ap special status

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గానీ, విభజన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఏపీకి ఇచ్చేశామని, ఇక ఇచ్చేదేమీ లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ అధికారికంగా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం గమనించాల్సిన విషయం. ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడంలేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ అఫిడవిట్ లో ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది. మరోపక్క దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాఅసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూ లోటు కేవలం రూ. 4,116 కోట్లు మాత్రమేనని… ఇప్పటి వరకు రూ. 3,979 కోట్లు ఇచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చామని… యూసీలు సమర్పించిన తర్వాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల వంతున చెల్లిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.