టీడీపీ శ్రేణులకి చంద్రబాబు కీలక ఆదేశాలు !

Chandrababu

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడికావడంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు ఈరోజు కీలక సూచనలు చేశారు. నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలు ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. ఈ నెల రోజులూ చాలా కీలకమని, సమగ్ర ప్రణాళికతో కదం తొక్కాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామని, ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ‘మీ భవిష్యత్‌ నా బాధ్యత’ అనే నినాదం తమదైతే, ‘మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ’ అనే నినాదంతో జగన్ ఉన్నారని ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారని వ్యాఖ్యానించారు. దీని బట్టే ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు.

‘మీ భవిష్యత్‌ నా బాధ్యత’ అనే టీడీపీ నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని, కేసీఆర్‌కు మనకు తేడా అక్కడేనని, దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా తమకు ఉందని, చేతకాని వాళ్లం కాదని బాబు అన్నారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను దొంగతనంగా అనుభవిస్తూ కుట్రలు పన్నేస్థాయికి వచ్చారని దుయ్యబట్టారు. ఇవాళ్టి నుంచి నెలరోజుల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. దీన్ని సమర్థంగా ఎండగట్టాలని, మేలో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌కు జరపడాన్ని సంక్షోభంగా భావించరాదని, దీన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.