సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్న ఛార్మి

సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్న ఛార్మి

ఒకానొక సమయంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఛార్మి. తన అందచందాలతో వెండితెరపై మెరుపులు మెరిపించి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అప్పట్లో రొమాంటిక్ ప్రియులను ఫిదా చేసే హాట్ ట్రీట్ ఇవ్వాలంటే ఛార్మిని మించి ఇంకెవ్వరి వల్లకాదన్నట్లుగా ఉండేది ట్రెండ్. అయితే ఆ తర్వాత మెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో దోస్తీ కట్టి అతనితో మూవీ నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతోంది. అయితే ఆమె ఇప్పుడు మరో ఊహించని నిర్ణయం తీసుకోవడం జనాల్లో చర్చనీయాంశం అయింది.

సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్ సినిమాలకు దూరమై తమ ఫ్యామిలీతో గడపడం చూశాం. కానీ ఛార్మి అందుకు విరుద్ధంగా పెళ్లి కాకుండానే కెమెరా కంటికి చిక్కకుండా తెరవెనుక చేరిపోయింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి నిర్మాతగా అడుగులేసింది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించి పూర్తి బాధ్యతలు మోస్తూ వస్తోంది. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ లాభాలు గడించి దూసుకుపోతున్న ఆమె.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులను టచ్ చేస్తూ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తోంది.

అయితే ఉన్నట్టుండి తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానంటూ ఛార్మి ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ట్రోల్స్ బారిన పడితే సెలబ్రిటీలు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం చూశాం. కానీ ఛార్మి విషయంలో అలాంటివి చాలా దూరం. అయినా కూడా ఛార్మి ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు దూరం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ సడెన్ డెసీషన్ వెనుక ఉద్దేశ్యం ఏంటనే కోణంలో అంతా ఆలోచిస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే గందరగోళంలో పడిపోయారు. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో కొత్త సినిమా ‘లైగర్’ అప్‌డేట్స్ ఇచ్చే ఛార్మి, ఇలా సోషల్ మీడియాను పక్కనబెడితే ఎలా? అని ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమాకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను ఛార్మి స్వయంగా చూసుకుంటోంది. ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.