22 మంది స్కూల్ విద్యార్థులకి వైరస్ లక్షణాలు

22 మంది స్కూల్ విద్యార్థులకి వైరస్ లక్షణాలు

తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మొన్నకరీంనగర్, నిన్న వరంగల్.. నేడు సిద్దిపేట జిల్లాలో కరోనా కేసులు రావడం కలవరపాటుకు గురిచేసింది. జిల్లాలోని కొండపాక ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. రెండురోజుల కిందట ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది పాఠశాల విద్యార్థుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో అలజడి రేగింది.

స్కూల్లో 22 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయుల్లోనూ వైరస్ లక్షణాలు కనిపించాయి. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఫలితాలు రేపు వచ్చే అవకాశముంది. కరోనా వైరస్ లక్షణాలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

నిన్న వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఖిలా వరంగల్ మండల పరిధిలో పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో పిల్లలను పాఠశాలకు పంపాలా? వద్దా? అని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.