Crime: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

Crime: Fatal road accident in Kakinada.. RTC bus crash.. 4 dead
Crime: Fatal road accident in Kakinada.. RTC bus crash.. 4 dead

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న APSRTCబస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు సీఐ శేఖర్బాబు, ఎస్సై పవన్కుమార్ వివరాలు తెలుసుకున్నారు. మృతులను నక్క బొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను సేకరించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.