కరోనా బారిన పడ్డ సీఎస్‌కే సభ్యులు

కరోనా బారిన పడ్డ సీఎస్‌కే సభ్యులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో భాగంగా యూఏఈలో అందరికంటే ముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)ను ఇప్పుడు కరోనా కలవర పెడుతుంది. సీఎస్‌కేలో ఒక బౌలర్‌తో పాటు పలువురు స్టాఫ్‌ మెంబర్స్‌కు కరోనా వైరస్‌ సోకింది. మొత్తంగా 10 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్‌ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి సీఎస్‌కే ఈ రోజు నుంచే నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అది కాస్తా ఇప్పుడు వీలుపడటం లేదు. కాగా, ఆగష్టు 21వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుబాయ్ చేరుకున్న సీఎస్‌కే.. షెడ్యూల్ ప్రకారం ఆరు రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌, అధికారులు ఈరోజు మరొకసారి టెస్టులు చేయించుకున్న తర్వాత 10 మందికి పైగా కరోనా నిర్దారణ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలుకానున్న తరుణంలో ఇంక ఎంతమంది కరోనా బారిన పడతారో అనే ఆందోళన మిగతా ఫ్రాంచైజీల్లో మొదలైంది.