తీవ్ర వాయుగుండంగా మారి తుపాను

తీవ్ర వాయుగుండంగా మారి తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడనుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి.

5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. సాయంత్రానికి ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. అది మరింత బలపడి, తుపానుగా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుందని తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలను అలర్ట్​గా ఉండాలని సూచించారు. సమయం గడుస్తున్న కొద్ది.. తుపాను తీరాన్ని తాకే ప్రాంతంపై స్పష్టత రానుంది. 24 ఎన్​డీఆర్​ఎఫ్​, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్​ఏఎఫ్​ను ఆయా ప్రాంతాల్లో మోహరించారు.