హైదరాబాద్ శివారులో మరో ఘోరం

హైదరాబాద్ శివారులో మరో ఘోరం

హైదరాబాద్ శివారులో మరో ఘోరం వెలుగుచూసింది. మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పహాడీషరీఫ్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. జల్‌పల్లిలోని ఆర్.ఆర్.మసాలా గేటు సమీపంలోని చెరువు వద్ద నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉంది. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళను అతి దారుణంగా అంతమొందించారు.

మహిళ ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. బండరాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల క్షుణ్ణం పరిశీలించారు. ఆటో వచ్చి వెళ్లిన గుర్తులు ఉండడంతో చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. అనంతరం కిరాతకంగా చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మహిళ ధరించిన బురఖా, చెప్పులు మృతదేహానికి సమీపంలోనే చిందరవందరగా పడి ఉన్నాయి. డాగ్‌స్క్వాడ్‌ స్పాట్‌కి కొద్దిదూరంలో ఉన్న గది వరకూ వెళ్లి ఆగిపోయింది. మహిళ ఎవరనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.