వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ

వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ

కర్నూలు జిల్లా నంద్యాలలో డెడ్‌బాడీ కలకలంరేపింది. దేవనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ అల్లా బకాష్ నివాసం ఉంటున్నాడు. రెండు, మూడు రోజులుగా ఇంటిపైన ఉన్న ట్యాంకు నుంచి నీళ్లు సరిగా రాకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించాడు. అతడు మరమ్మతుల నిమిత్తం ట్యాంకు మూత తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. డెడ్‌బాడీని చూసి కంగుతిన్న ప్లంబర్ విషయాన్ని బకాష్‌కు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు ఎవరు?, ఎవరైనా హత్య చేసి ట్యాంక్‌లో పడేశారా?, డెడ్‌బాడీని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.