వెంకటేశ్వర స్వామి సన్నిదిలో దీపిక దంపతులు

వెంకటేశ్వర స్వామి సన్నిదిలో దీపిక దంపతులు

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనె, రణ్‌వీర్ వివాహబంధానికి ఏడాది పూర్తయింది. దీప్‌వీర్ నేడు తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం ముంబై నుంచి తిరుపతి వచ్చిన వీరు.. గురువారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో దీపిక, రణ్‌వీర్ జంటను సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన రణ్‌వీర్, దీపిక జంట అభిమానులకు అభివాదం చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ జంట ఫొటోలకు పోజులిచ్చారు. వాళ్లను తమ ఫోన్లలో బంధించేందుకు అభిమానులు అమితాసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. రణ్‌వీర్, దీపిక శుక్రవారం ఉదయం అమృత్‌సర్‌కు చేరుకొని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్‌వీర్, దీపిక కిందటేడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లిచేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. కొంకటి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. అప్పట్లో ఈ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి తర్వాత రణ్‌వీర్-దీపిక రెండు రిసెప్షన్లు ఏర్పాటుచేశారు. మొదటి రిసెప్షన్ నవంబర్ 21న దీపిక హోమ్ టౌన్ బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. రెండో రిసెప్షన్ ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఏర్పాటుచేశారు. ఈ రిసెప్షన్‌లో బాలీవుడ్ స్టార్లు అంతా పాల్గొన్నారు.