Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలువురు జాతీయ నేతలతో ముచ్చటించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించిన ఆయన తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడతో భేటీ అయ్యారు. నిన్న ఉదయం ప్రత్యేక విమానంలో ప్రకాష్ రాజ్, ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ లతో కలిసి వెళ్లిన సీఎం కేసీఆర్ దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు – కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చలు జరిపారు.
చర్చల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తాను ప్రారంభించదలచుకున్న ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వెంట ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే ఫెడరల్ ఫ్రంట్ కు తమ మద్దతు ఉంటుందని గౌడ ప్రకటించేశారు. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రారంభించదలచుకున్నది ఫెడరల్ ఫ్రంట్ ఎంతమాత్రం కాదని అది పీపుల్స్ ఫ్రంట్ అని దేవేగౌడ ప్రకటించారు. పీపుల్ ఫ్రంట్ అంటే మూడో ఫ్రంటో – నాలుగో ఫ్రంటో కాదని చెప్పిన గౌడ… అది పథకాల ఆధారిత ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలను తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చక్కటి కార్యక్రమం చేపట్టారని కేసీఆర్ను దేవేగౌడ ప్రశంసించారు. అలాగే కేసీఆర్ ఆధ్వర్యంలో పురుడుపోసుకుంటున్న ఫ్రంట్… ఎవరినో గద్దె దించడానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నది కాదని పేర్కొన్నారు. కేసీఆర్ తాయారు చేయనున్న ఫ్రంట్ ప్రయత్నాలని డేరింగ్ స్టెప్ గా గౌడ అభివర్ణించారు, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దేశం ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందడుగు వేశారని ఈ నేపథ్యంలోనే తాము కేసీఆర్ కి మద్దతుగా నిలవనున్నామని ప్రకటించేశారు