ఫ్రాంక్ ఛానల్స్ ఎత్తేస్తారా..? ఓ ఫ్రాంక్ పై కేసు

సోషల్ మీడియా అంటూ యూ ట్యూబ్ చానళ్లు వచ్చాక విష సంస్కృతి మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే అసలు యూ ట్యూబ్ ఛానళ్లతో సమాజానికి ఎంత మేలో.. అంత కీడు కొన్ని ఘటనలను బట్టి తెలిసిపోతుంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ ఛానళ్లకే పరిమితమైన ప్రాంక్‌ వీడియోలు యూట్యూబ్‌ చానళ్లతో ఈ నగరానికి కూడా పాకింది. ప్రాంక్‌ పేరుతో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు.

సరదాగా అని చెప్పి.. ‘నేను సింగిల్‌ అండి… నాకు ఓ హగ్‌ ఇస్తారా? అంటూ ప్రాంక్‌ పేరుతో వీడియో రూపొందించిన ‘డ్రీమ్‌ బాయ్‌ జయసూర్య’ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు రమావత్‌ సురేష్‌… తన చానల్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు తాజాగా సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి కావడం విశేషం. సురేష్‌ గత కొన్నాళ్లుగా డ్రీమ్‌ బాయ్‌ జయసూర్య పేరుతో ఓ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, దాంతో బెట్టింగ్స్‌కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తుండటం విశేషం.

అదేవిధంగా తన చానల్‌ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్‌ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై చెడ్డీ… ఆ పైన టవల్‌ కట్టుకుని ఓ పబ్లిక్‌ ప్లేసులో తిరుగుతూ… యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్‌ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్‌ వీడియోను గత సంవత్సరం తన యూట్యూబ్‌ చానల్‌లో పెట్టాడు కూడా. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్‌ సురేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఇతడు రూపొందించిన వీడియోపై ఇప్పడు కేసు పెట్టడం జరిగింది.

అయితే ఈ వీడియోలో ఏముంది అంటే… నగరంలో పలు ప్రాంతాల్లో అతడు ‘నేను సింగిల్‌ అండి… ఓ హగ్‌ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్‌ చానల్‌ డ్రీమ్‌బాయ్‌ జయసూర్యలో అప్ లోడ్ చేశాడు. ప్రతి సన్నివేశంలో బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్స్, మ్యూజిక్‌ను రూపొందించాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 12లక్షల మంది చూశారు. ప్రతి సన్నివేశం ముగిసిన తర్వాత ఇది ప్రాంక్‌ వీడియో అంటూ వారికి చెప్తూ..

అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్‌ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్‌ చానల్‌లో ఉన్న ఆ వీడియోను చూసిన ఈ ఇద్దరు యువతుల తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్‌లో పెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే నగర సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క వీడియో అన్నీ ఫ్రాంక్ ఛానళ్లపై వేటు పడునుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.