మెగాస్టార్‌ తర్వాత సూపర్‌ స్టార్‌తో..!

surender reddy to direct mahesh babu

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి తన తదుపరి చిత్రానికి అప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సంవత్సరం క్రితం ప్రారంభం అయిన సైరా చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ ఉన్నారు. దర్శకుడు ఇలాంటి సమయంలో పూర్తి శ్రద్దను సైరాపైనే పెట్టాలి. కాని సురేందర్‌ రెడ్డి మాత్రం తన భవిష్యత్తును కూడా ఆలోచించుకుంటూ అడుగు వేస్తున్నాడు. చిరుతో సినిమా పూర్తి అయిన వెంటనే తదుపరి చిత్రాన్ని చేయాలని, ఎక్కువ సమయం వృదా చేయవద్దని ఆలోచిస్తున్నాడు.

ఇప్పటికే అల్లు అర్జున్‌తో ఒక సినిమాకు కమిట్‌ అయిన సురేందర్‌ రెడ్డి ఆ సినిమా కంటే ముందే మహేష్‌బాబుతో ఒక చిత్రాన్ని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఆ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వేసవి కాలంలో చిత్రాన్ని విడుదల చేయాలని వంశీ ప్లాన్‌ చేస్తున్నాడు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి మరియు మహేష్‌బాబులు కాస్త అటు ఇటు తేడాతో వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరు ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం కలిసి సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌తో సినిమాను చేసేందుకు సురేందర్‌ రెడ్డి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో అతిథి చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా మహేష్‌కు సురేందర్‌ రెడ్డిపై చాలా నమ్మకం.