Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ బయోపిక్ ఒక్క సినిమా అనుకుంటే ఇప్పటికే మూడు సినిమాలుగా మారిపోయింది. అసలు బయోపిక్ తీస్తున్న వారి కంటే కొసరు పాయింట్స్ పట్టుకుని “లక్ష్మీస్ ఎన్టీఆర్ “, “లక్ష్మీస్ వీరగ్రంధం “ లాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళ హడావిడి ఎక్కువైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈయన గారితో ఎన్టీఆర్ దగ్గరుండి స్టోరీ, స్క్రిప్ట్ రాయించేస్తున్నారట.
ఎన్టీఆర్ ఆత్మ ఏకంగా ఈయనకి గైడ్ గా ఉంటోందట. రాము మాటల్లో నిజం కోసం జనం వెదకడం ఎప్పుడో మానేశారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఇక “లక్ష్మీస్ వీరగ్రంధం “ చేస్తున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఆయన లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు స్వగ్రామం ఎక్కడో కనుక్కుని మరీ అక్కడికి వెళ్లి విషయ సేకరణ చేస్తున్నారు. ఈయన కూడా చాలా సింపుల్ గా ఎన్టీఆర్ తన కలలోకి వచ్చారు అంటున్నారు. పాపం ఈ పోటీలో ఇంకా వెనుకబడింది తేజ ఒక్కరే.
ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య దగ్గరుండి మరీ స్క్రిప్ట్, నటీనటుల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించడంలో కాస్త సీరియస్ వర్క్ చేస్తున్న టీం ఇదే. అయినా మిగతా ఇద్దరిలా లేనిపోని ప్రచారం కోసం పాకులాడటం ఇష్టం లేకో ఏమో ఎన్టీఆర్ సినిమా గురించి ఎక్కడా ఆర్భాటపు ప్రకటనలు చేయడం లేదు.
దర్శకుడు తేజ అయితే బాలయ్య తనని పిలిచి ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం ఇచ్చారని చెప్పారు తప్ప ఆ సినిమా గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేదు. తమ కన్నా తాము తీసిన సినిమా ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని ఈ టీం భావిస్తోంది. అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుందన్న నానుడి టైపు లో వుంది ఈ సినిమా యూనిట్ వ్యవహారం. అయితే ఇవేమీ పట్టని కొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ దృష్టిలో ఉంచుకుని తేజ కలలోకి ఎన్టీఆర్ రారా అని జోక్ చేసుకుంటున్నారు.