Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రకటించాడో అప్పటి నుండి కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా వర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. తనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్క నాయకుడికి తనదైన శైలిలో స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నాడు వర్మ. టీడీపీ నాయకుడు, మంత్రి అయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిత ఇంకా పలువురు టీడీపీ నాయకులు ఇప్పటి వరకు వర్మ తీస్తున్న సినిమాపై విమర్శలు చేశాడు. వర్మను ఆ సినిమా ఆపేయాలంటూ హెచ్చరించారు. వారందరికి కూడా వర్మ పేరు పేరున, ప్రతి విమర్శకు సమాధానం చెప్పాడు.
తాజాగా నిన్నటి తరం హీరోయిన్ వాణి విశ్వనాధ్ కూడా వర్మపై విమర్శలు గుప్పించింది. త్వరలో ఈమె తెలుగు దేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈమె తెలుగు దేశంకు మద్దతుగా వర్మను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసింది. అందరిని ఏకి పారేసిన వర్మ ఈమెను మాత్రం ఎందుకు వదులుతాడు చెప్పండి. అందరిలాగే ఈమెను కూడా ఫేస్బుక్ ద్వారా టార్గెట్ చేశాడు. వాణి విశ్వనాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అభిమానిగా, ఆయన చివరి సినిమాలో హీరోయిన్గా నటించిన వ్యక్తిగా, ఆయనపై ఉన్న గౌరవంతో చెప్తున్నా వెంటనే వర్మ ఆ సినిమాను ఆపేయాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెస్తే ఊరుకునేది లేదు. ఎన్టీఆర్ ఇంటి ముందు ధర్నా చేసేందుకు సైతం సిద్దం అంటూ వర్మను హెచ్చరించింది.
అందుకు వర్మ స్పందిస్తూ… వాణి గారు నా ఇంటి ముందు ధర్నా చేసేందుకు నాకు అసలు ఇల్లు లేదు. రోడ్ల మీద పడి తిరుగుతున్న నా ముందు ధర్నా చేయాలి అంటే మీరు కూడా రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది. అలా రోడ్ల మీద తిరిగితే మీ సుకుమారమైన పాదాలు కమిలిపోతాయేమో అంటూ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి వర్మ ఏ ఒక్కరిని వదలకుండా వారు చేసిన విమర్శ, తన కౌంటర్ను ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసి తన సినిమాకు ఫుల్గా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.