వీల్‌చైర్ క్రికెట్‌లో రాణిస్తున్న దివ్యాంగుడు.. జాతీయస్థాయికి ఎదిగిన తెలంగాణ యువకుడు..

‘కృషి ఉంటే మనుషులు ఋషులు అవవుతారు’ అన్నారు పెద్దలు. పట్టుదల, సాధన చేస్తే సాధించలేని అంటూ ఏమి లేదు. ఇదే విధమైన సంకల్ప బలంతో తెలంగాణకు చెందిన ఒక యువకుడు తనలోని లోపాన్నే ఆయుధంగా మార్చుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అతని సంకల్ప బలం ముందు అతనిలోని ఉన్న అంగ వైకల్యం కూడా ఓడిపోయింది. ఇంతకీ ఎవరీ దివ్యాంగుడు..? క్రికెటర్‌గా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుండ్లకు చెందిన బాలు, మల్లి దంపతులకు ముగ్గురు కొడుకులు, కుమార్తె కూడా ఉన్నారు. బాలు కుటుంబానికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అంతలోనే ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుకు ధరావత్ సురేష్‌కు 8 ఏళ్ళ వయసులో పోలియో వ్యాధి సోకి దివ్యాంగుడిగా మారాడు. అయితే సురేష్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మహా ఇష్టం. డిగ్రీ పూర్తి చేసిన సురేష్.. చేతికర్ర సహాయంతో క్రికెట్ ఆడేవాడు. ఇలా క్రికెట్ ఆడుతూ వీల్ చైర్‌ ప్లేయర్‌గా మారాడు. తొలుత వీల్ చైర్ క్రికెటర్‌గా పలు జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. 2020లో రాజస్థాన్‌లో నిర్వహించిన వీల్ చైర్ క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ పోటీల్లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును కూడా సాధించాడు సురేష్. 2022లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ వీల్ చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో సురేష్ పాల్గొన్నాడు. ఈ లీగ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా, ఫీల్డర్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సురేష్ ప్రతిభను గుర్తించిన సెలెక్టరులు వీల్ చైర్ క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు.