కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

కరోనా క్లిష్ట సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల ‘పైసా’చిక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజి) హాస్పిటల్‌ నిర్వాకం బయటపడింది. కరోనా వైద్యం పేరుతో తన వద్ద అధిక ఫీజులు వసూలు చేయాలని చూస్తున్నారని విజయా కేసరి అనే మహిళా డాక్టర్‌ సెల్ఫీ వీడియలో ఆవేదన వ్యక్తం చేశారు. చేయని చికిత్సకు బిల్లులు వేసి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ..

‘మా నాన్నకు అనారోగ్యం కారణంగా ఏఐజీలో చేరాం. తర్వాత నాకు, మానాన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అయితే, మాకు వెంటిలేటర్, ఆక్సిజన్‌ పెట్టకపోయినా భారీగా బిల్లులు వేశారు. అదేంటని ప్రశ్నిస్తే హడావుడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయాలని చూస్తున్నారు. అధిక మొత్తం డబ్బు వసూలు చేయాని చూస్తున్నారు. 14 రోజులగా నరకం చూస్తున్నాం.ఇండియాలో ఇంత ఫ్రాడా.

ఆస్పత్రికి వచ్చిన రోగులను బాగు చేసి పంపాల్సింది పోయి.. అధిక చార్జీలతో వేధిస్తున్నారు. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పటికేం ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు కాల్‌ చేశా. దయచేసి ఆయన స్పందించి ఆదుకోవాలి’అని విజయ కన్నీటి పర్యంతమయ్యారు.