వరకట్న దాహనికి యువతి ఆత్మహత్య

వరకట్న దాహనికి యువతి ఆత్మహత్య

మహిళలపై వేధింపులు, అకృత్యాలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కేటుగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా, వరకట్న దాహనికి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన యూపీలోని కేడీ గ్రామంలో గత బుధవారం చోటుచేసుకుంది. ఖుష్బు అనే యువతికి సమీప​ గ్రామంలోని యూనస్‌తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో వరుడు తరపు వారు పెళ్లికి ముందే.. కట్నంగా 5 లక్షల నగదు, ఒక కారును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే, వధువు తరపువారు మొదట అడిగిన కట్నానికి అంగీకరించినప్పటికీ, సమయానికి కట్నం ఇవ్వలేకపోయారు. దీంతో వరుడు తరపు వారు పెళ్లి వేడుకకు అభ్యంతరం తెలిపారు. దీంతో ఖుష్బు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.