ఎస్సై కి గాయాలు చేసిన మందుబాబు

ఎస్సై కి గాయాలు చేసిన మందుబాబు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో తప్పించుకునేందుకు ఓ మందుబాబు చేసిన ప్రయత్నంతో ఎస్సై గాయాలపాలైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ వివరాల ప్రకారం.. ఎస్సై కె. రాజేశ్వర్‌ , ప్రొబెషనరీ ఎస్సై మౌనిక, సిబ్బందితో కలిసి జేఎన్‌టీయూహెచ్‌ మొదటి గేటు వద్ద సోమవారం అర్ధరాత్రి డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌కు చెందిన స్క్రాప్‌ వ్యాపారి గడ్డమీది సాయికుమార్‌ మద్యం తాగి తన బుల్లెట్‌పై అటువైపుగా వచ్చాడు.

పోలీసులను గుర్తించి వాహనాన్ని వెనక్కి తిప్పుతుండగా అటువైపు నుంచి కానిస్టేబుల్‌ అబ్దుల్‌ రావడాన్ని చూసి బారికేడ్ల వైపు దూసుకువచ్చాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆపేందుకు యత్నిస్తుండగా బారికేడ్లతో పాటు ఎస్సై రాజేశ్వర్‌ను ఢీకొట్టాడు. సాయికుమార్‌ను పట్టుకొని శ్వాస పరీక్ష చేయగా 175 పాయింట్లు వచ్చింది. అయితే.. గాయపడ్డ ఎస్సై రాజేశ్వర్‌ను ఆసుపత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా సాయికుమార్‌ మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.