ఎలక్ట్రిక్‌ బస్సు అగ్నికి ఆహుతి

ఎలక్ట్రిక్‌ బస్సు అగ్నికి ఆహుతి

సికింద్రాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ కంటోన్మెంట్‌ డిపోలో మంగళవారం ఓ ఎలక్ట్రిక్‌ బస్సు అగ్నికి ఆహుతి అయింది. విద్యుత్‌ చార్జింగ్‌ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే పూర్తిగా దగ్ధమైంది. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ఫైరింజన్‌ కేవలం 10 నిమిషాల్లో డిపోకు చేరుకున్నప్పటికీ ఆలోపే బస్సంతా కాలిపోయింది. జేబీఎస్‌ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య నడిచే ఓ ఎలక్ట్రిక్‌ బస్సు మంగళవారం ఉదయం రెండు ట్రిప్పులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు డిపోకు వచ్చింది.

డ్రైవర్, కండక్టర్‌ దిగాక డిపో సిబ్బంది బస్సును చార్జింగ్‌కు పెట్టారు. కాసేపయ్యాక ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని ఇతర బస్సులకు మంటలు అంటుకోకుండా వాటిని దూరంగా తీసుకెళ్లారు. అలాగే ప్యారడైజ్‌ చౌరస్తా సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్‌ సిబ్బంది డిపోకు వచ్చేసరికే బస్సు మంటల్లో కాలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్‌ బస్సు మూడేళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుండటం గమనార్హం.