మాజీ ప్రధానికి పరువునష్టం

మాజీ ప్రధానికి పరువునష్టం

ఓ నిర్మాణ సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ప్రధానికి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. సదరు సంస్థకు పరువు నష్టం కింద రూ.2 కోట్ల చెల్లించాలని ఆదేశించింది. నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్ (నైస్) అనే సంస్థపై మాజీ ప్రధాని దేవేగౌడ 2011లో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సంస్థ తమ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

నైస్ సంస్థకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని మాజీ ప్రధానిని సివిల్ కోర్ట్ న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు. గతంలో ట్రయల్ కోర్టు ఆదేశాలపై అసంతృప్తి చెందిన దేవగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తమకు రూ.10కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడం వల్ల తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు వివరాల్లోకి వెళితే 2011 జూన్ 28న ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన ‘‘గౌడర గర్జన’ కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైస్ సంస్థ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై ఆ సంస్త ఎండీ, బీదర్ దక్షిణ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనై కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. ‘ప్రస్తుతం పరువు నష్టం కలిగించే ప్రకటనలు భవిష్యత్తులో చేయడానికి అనుమతిస్తే ఖచ్చితంగా కర్ణాటక ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.