తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మృతి

తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మృతి

నగరంలో కరోనా వైరస్‌ విజృంభణ అంతకంతకూ అధికమవుతోంది. ప్రభుత్వ సడలింపులతో ఇటీవల సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు ప్రారంభం కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఇండస్ట్రీ కార్మికులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

ఈతరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు. కరోనా బారినపడటంతో రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు. ఇక బిగ్‌బాస్‌-3తో పాపులర్‌ అయిన రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామి, ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, సాక్షి శివ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.