హోటల్‌లో అగ్రిప్రమాదం

హోటల్‌లో అగ్రిప్రమాదం

హన్మకొండలోని ప్రముఖ హోటల్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. జడ్పీ చైర్‌పర్సన్ గుండు సుధారాణికి చెందిన హోటల్ సుప్రభలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ వెనుక భాగంలో ఏసీ పైపులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. క్రమంగా మంటలు కిచెన్ రూమ్‌కి వ్యాపించడంతో భారీగా పొగలు వచ్చాయి. మంటలు కిటికీల్లో నుంచి ఎగసిపడ్డాయి. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని హోటల్‌లో ఉన్న వారు బయటికి రావడంత పెనుప్రమాదం తప్పింది.

అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌‌లో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా? లేక కిచెన్ రూమ్‌లో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కిచెన్‌లో మంటలు చెలరేగి ఏసీ పైపులకు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.