క్లాత్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

క్లాత్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలోని థానేలోని ఓ క్లాత్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి అగ్నికి ఆహుతి అయింది. భివాండిలోని కాజీ కాంపౌండ్‌లో ఓ మూతబడిన ఫ్యాక్టరీలో తొలుత చిన్న మంట రాజుకుంది. తర్వాత పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

స్థానికులు అందించిన సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అసలు మంటలు ఎలా వ్యాపించాయో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మూతబడిన ఫ్యాక్టరీ కావడంతో ఎవరికి ఏ హాని జరగలేదు. కానీ కోట్లాది రూపాయల విలువైన ఆస్తి మాత్రం నాశనం అయినట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ ధ్రువీకరించింది.కాగా గతవారం థానేలోని భివాండి ప్రాంతంలోనే ఓ అగ్ని ప్రమాదం జరిగింది.

ఆ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పరస్‌ నాథ్ కాంప్లెక్స్ గోదాములో మంటలు వ్యాపించాయి. ఐదు ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల్లో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. దీంతోపాటు వారం క్రితం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ విమానానికి పుష్ బ్యాక్ ఇచ్చిన వాహనంలో మంటలు చెలరేగాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-647ని వెనుక నుంచి నెట్టడంతో విమానం టగ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారు.