దేశంలో తొలిసారి.. నిండుగర్బిణికి కరోనా.. డెలివరీ సక్సెస్

ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ వైద్యుడి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారించారు వైద్యులు. అసలే ఆమె నిండు గర్భిణి. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. అమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఆమెకు రాత్రి పురిటినొప్పులు రావడంతో.. అక్కడే పురుడు పోసుకుంది. వైద్యులు డాక్టర్ అపర్ణ శర్మ, డాక్టర్ గారిమా ఖాడ్గావత్, డాక్టర్ రమేష్ అగర్వాల్, డాక్టర్ రాజేష్ కుమారి, డాక్టర్ పరుల్, అనస్థీషియాకు చెందిన ప్రొఫెసర్ రాజేశ్వరి, డాక్టర్ అంజోలీ ఛబ్రాతో సహా వివిధ విభాగాలకు చెందిన 10 మంది వైద్యుల బృందం ఈ ఆఫరేషన్ లో పాల్గొన్నారు. ఆమెకు డెలివరీ పూర్తి చేసేందుకు గత రాత్రి ఎంతో వ్యూహంతో ముందుకు వైద్యబృందం అడుగులు వేసింది. డెలివరీ కోసం, ఐసోలేషన్ గదినే ఆపరేషన్ థియేటర్‌గా మార్చి.. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.

మొత్తానికి ఆఫరేషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రస్తుతం తల్లితోపాటే పిల్లవాడని కూడా ఉంచారు. అలాగే…. తల్లి పాలతో కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని దాంతో.. తల్లి నుంచి ఆ పిల్లవాడికి పాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా డెలివరీని సవాలుగా తీసుకున్న వైద్యులు ఆమెకు శ్వాసకోశ సమస్య వస్తే అది చాలా కష్టం కావచ్చు అన్న ఉద్దేశ్యంతో అక్కడే ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి డెలివర్ చేసినట్లు వైద్యులు వివరించారు. కాగా ఇప్పుడు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే.. బిడ్డకు కూడా కరోనా టెస్ట్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ.. బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.