పట్టపగలు మేయర్‌ దారుణహత్య

పట్టపగలు మేయర్‌ దారుణహత్య

సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్తున్న మేయర్‌ను బైక్‌పై వెంబడించిన దుండగులు ఓ చౌరస్తాకు చేరుకోగానే అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు ఛాతీపై చేయడంతో ఆ మేయర్‌ కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ మేయర్‌ శుక్రవారం కన్నుమూశారు. పట్టపగలే ఈ సంఘటన జరగడం బిహార్‌లోని కఠిహార్‌లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కఠిహార్‌ మేయర్‌ శివరాజ్‌ పాశ్వాన్‌ గురువారం ఓ సమావేశం ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కొందరు దుండగులు ఆయనను బైక్‌లపై వెంబడించారు. సంతోశీ చైక్‌కు చేరుకోగానే దుండగులు ముందుకు వచ్చి శివరాజ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

కఠిహార్‌లోనే పేరుమోసిన గూండా గుడ్డు మియాను హత్య చేసిన కొన్ని గంటల్లోనే మేయర్‌ కూడా హత్యకు గురి కావడంతో రెండు హత్యలు చేసింది ఒకటే గ్యాంగ్‌ అని తెలుస్తోంది. హత్యకు ముందు ఏం జరిగిందో పోలీసులు తెలుసుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అయితే ఆ గూండా, మేయర్‌ హత్యకు కారణం రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలే కారణమని సమాచారం. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మేయర్‌ హత్య రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది.