ముఖేశ్‌ అంబానీకి గౌతమ్‌ అదానీ ఝలక్‌

ముఖేశ్‌ అంబానీకి గౌతమ్‌ అదానీ ఝలక్‌

దేశంలోనే కాదు ఏషియాలోనే నంబర్‌ వన్‌ సంపాదనపరుడి హోదాలో కొనసాగుతున్న ముఖేశ్‌ అంబానీకి మరో గుజరాతి గౌతమ్‌ అదానీ ఝలక్‌ ఇచ్చారు. ఏషియా నంబర్‌ కుబేరుడి స్థానాన్ని ముకేశ్‌ నుంచి లాగేసుకున్నాడు గౌతమ్‌. ఫిబ్రవరి 8న బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో వీరిద్దరి స్థానాలు మారాయి.

బ్లూంబర్గ్‌ ప్రపంచ కుబేరులు 500 జాబితాలో ఫిబ్రవరి 8న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో గౌతమ్‌ అదానీ సంపద 88.50 బిలియన్‌ డాలర్లు ఉండగా ముకేశ్‌ అంబానీ సందప 87.90 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ముకేశ్‌ కంటే అదాని సంపద 600 మిలియన్లు ఎక్కువగా నమోదైంది. దీంతో ఏషియాలోనే నంబర్‌ వన్‌ ధనవంతుడిగా అదానీ అవతరించారు. అంతకు ముందు ఈ స్థానం ముకేశ్‌ పేరిట ఉండేది.

బ్లూంబర్గె్‌ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఇప్పటి వరకు పదో స్థానంలో కొనసాగుతూ వచ్చిన ముఖేశ్‌ అంబానీ తాజాగా 11వ స్థానానికి పడిపోగా గౌతమ్‌ అదాని 11వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరుకున్నారు. ఏడాది కాలంలో ముకేశ్‌ అంబానీ సంపద 2.07 బిలయిన్లు తరిగిపోగా అదానీ సంపద 12 బిలియన్లు పెరిగింది.

మంగళవారం ఉదయం రిలయన్స్‌ షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతుంది. గత ఏడాది కాలంలో ఈ షేరు ధర 18 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో అదానీ కంపెనీ షేరు ఏకంగా 170 శాతం వృద్ధిని కనబరిచి రూ.1741 దగ్గరకి చేరుకుంది. దీంతో అదానీ సంపద గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్‌ పేర్కొంది.