జెనీలియా కి కరోనా పాజిటివ్

జెనీలియా కి కరోనా పాజిటివ్

మహమ్మారి కరోనా ఎవరినీ వదలడం లేదు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా అందరినీ వెంటాడుతూ చుక్కలు చూపిస్తోంది. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి జెనీలియా దేశ్‌ముఖ్‌ కూడా ఈ జాబితాలో చేరారు. మూడు వారాల క్రితం తనకు కరోనా సోకిందన్న ఆమె.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని శనివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మహమ్మారిని జయించి కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్ధమయ్యానని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మేరకు.. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే లక్షణాలేవీ బయటపడలేదు. దేవుడి దయ వల్ల నేను ఈరోజు కోవిడ్‌ నెగటివ్‌ ఫలితం వచ్చింది. నాపై కురిపించిన ఆశీర్వాదాలు వ్యాధితో నా పోరాటాన్ని సులభతరం చేశాయి. అయితే అదే సమయంలో 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం అనేది చాలా కఠినమైనది. ఫేస్‌టైం, ఇతరత్రా డిజిటల్‌ వ్యాపకాలు ఒంటరితనం అనే దుష్టశక్తిని అంతం చేయలేవు. నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యుల సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నింటి కంటే ఇదే అతిపెద్ద బలం. ప్రతీ ఒక్కరికి కావాల్సింది ఇదే’’ అంటూ జెనీలియా ఇన్‌స్టాలో భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు.