ఆరోగ్య శ్రీ కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ దీనిని ప్రకటించారు. అర్హులందరికీ ఈ పెంపు వర్తించనుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా మొదలుకానుంది. ఈనెల 19 నుంచి నూతన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద జనవరి ఒకటి నుంచి మలివిడత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసుల కిడ్నీ సమస్యల పరిష్కారానికి రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు, సమస్య రాకకు గల కారణాలపై పరిశోధనలకు రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన కిడ్నీ రీసెర్చి సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ‘హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటిని తెప్పించి, ఉద్దానంలోని ఏడు మండలాలకు చెందిన 807 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించనున్నారు. టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో 74 యంత్రాల ద్వారా డయాలసిస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఆసుపత్రిలో 37 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల ద్వారా అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి రక్తనమూనాల సేకరణ కూడా జరుగుతోంది’ అని ప్రభుత్వం వెల్లడించింది.