రైతులకు ముఖ్యమంత్రి శుభవార్త

రైతులకు ముఖ్యమంత్రి శుభవార్త

కరోనా వైరస్, వరదల ముప్పు పొంచి ఉన్న తరుణంలో రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 27వ తేదీన రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు‌ ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పంటలు, కోవిడ్‌, వార్డు సచివాలయాల తనిఖీలు, నాడు- నేడు తదితర అంశాలపై మంగళవారం ముఖ్యమంత్రి జగన్.. కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబర్ నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ నెల 27వ తేదీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ. 113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ. 32 కోట్లు ఇస్తామన్నారు. మొత్తం రూ. 145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నట్లు తెలిపారు.

అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఈ నెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.