ఏపీకి మరో భారీ ప్రాజక్ట్ !

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకమైన మరో ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు దేశంలో కేవలం ఒడిశాలోని బాలసోర్‌ (వీలర్ ఐలండ్)కే పరిమితమైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పుడు ఏపీలోనూ ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలోని గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. 154 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రయోగ కేంద్రానికి సంబంధించి ఈ దసరా నుంచే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భారీకు ప్రాజెక్టు తొలి దశలో రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దసరా నుంచే ప్రారంభమౌతాయని సంబంధిత అధికారి వెల్లడించారు.

నిజానికి దేశంలో మరో క్షిపణి ప్రయోగ కేంద్రం అవసరమని డీఆర్‌డీవో నిపుణులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద ఇందుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. సముద్ర తీరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని భావించిన నిపుణులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. క్షిపణి ప్రయోగ కేంద్రం ప్రతిపాదన రాగానే రాష్ట్ర ప్రభుత్వం మరోమాటకు తావులేకుండా వెంటనే ఆమోదించింది.

అందుకు అవసరమైన భూమిని కేటాయించింది. కొంత భూమి తగ్గడంతో అటవీశాఖ నుంచి తీసుకుని, దానికి మరో ప్రాంతంలో భూమి ఇచ్చింది. భూసేకరణ, నిర్వాసితులు వంటి చిక్కులు ఏర్పడినా ప్రభుత్వం వాటిని సమర్థంగా పరిష్కరించింది. మరోవైపు సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాల నుంచి సమాచారం.