ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాన్‌ వీర మరణం

ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాన్‌ వీర మరణం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా జవాన్‌ మరుపోలు జస్వంత్ రెడ్డి వీర మరణం పొందారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ కాల్పల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో ఒకరు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జశ్వంత్‌ రెడ్డి. ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో జశ్వంత్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) ఐదేళ్ల క్రితం సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి. నెలరోజుల క్రితమే సెలవులపై ఇంటికొచ్చిన జశ్వంత్ రెడ్డికి పెళ్లి చేయాలని భావించారు.

మరో నెల రోజుల్లో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ఇవాళ రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆధికారులు తెలిపారు.