నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా

నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్‌ జాబితాను ప్రకటించాయి. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా.. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, బుమ్రాలను మాత్రమే రిటైన్‌ చేసుకుంది. కాగా ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ వదిలేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ ముంబైతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో విడుదల చేశాడు.

”ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన క్షణాలను నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా. ఎన్నో ఆశలతో ఒక యంగ్‌స్టర్‌గా 2015లో ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన నేను ఈరోజు అంతర్జాతీయ స్థాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాను. ఈ ఆరేళ్లలో ముంబై ఇండియన్స్‌కు ఒక మంచి ఆల్‌రౌండర్‌గా పనిచేశాను. నాకు ముంబై ఇండియన్స్‌తో ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడింది. జట్టు ఆటగాళ్లతో స్నేహం.. ముంబై ఫ్యాన్స్‌ అభిమానం.. ఇవన్నీ నాకు గొప్పగా అనిపించాయి. ఇవాళ నన్ను ముంబై నన్ను వదిలేసి ఉండొచ్చు.. కానీ వారితో ఉన్న ఎమోషన్‌ మాత్రం ఎప్పటికి నాతోనే ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తో ఇన్నాళ్లు కలిసి గెలిచాం.. కలిసి ఓడాం.. ఈ క్షణంలో దూరమవ్వడం బాధ కలిగిస్తుంది. అయినప్పటికి నా గుండెల్లో ముంబై ఇండియన్స్‌ పేరు మాత్రం ఎప్పటికి నిలిచిపోతుంది.” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక 2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్‌ నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ముంబై టైటిల్‌ గెలవడంలో హార్దిక్‌ది కీలకపాత్ర. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ టీమిండియాలోనూ చోటు కోల్పోయాడు. టి20 ప్రపంచకప్‌ 2021కు ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పటికి.. ఒక్క మంచి ప్రదర్శన లేక విమర్శల పాలయ్యాడు. దీంతోపాటు బౌలింగ్‌కు దూరంగా ఉండడంతో ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌ హార్దిక్‌కు తీసేయొచ్చంటూ పలువురు మాజీలు చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే రీహాబిటేషన్‌ కోసం ఎన్‌సీఏకు వెళ్లిన హార్దిక్‌ సౌతాఫ్రికా టూర్‌కు తనను పరిగణించొద్దంటూ సెలక్టర్లను కోరడం ఆసక్తి కలిగించింది.