గర్భిణులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భిణులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు

పూర్వపు రోజుల్లో మనుషుల్లో ఇలా రకరకాల వ్యాధులు వచ్చేవి కావని, ఎప్పుడో ఒకసారి జ్వరమో, జలుబు వస్తే అది కూడా ఇంట్లో ఉన్న చిట్కాలతో తగ్గిపోయేదని చెబుతున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న తలనొప్పి వచ్చినా సరే వైద్యులను సంప్రదిస్తున్నాం. వేలల్లో డబ్బులను ఖర్చు చేసుకుంటున్నాం. ఇలా ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే ఏదో ఒక సందర్భంలో రోగాల బారిన పడుతూ అనేక అవస్థలు పడుతున్నాం.

విలువైన సమయంతో పాటు డబ్బులను వ్యర్థంగా వృథా చేసుకుంటున్నాం. ఇక గర్భిణులు, బాలింతల విషయంలో అయితే చాలు మన పెద్దవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వానాకాలంలో అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఇలాంటి వ్యాధులు వచ్చినపుడు ఎలా అధిగమించాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు. వానాకాలంలో బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మహమ్మారి కంగారు పెట్టిస్తున్న ఈ తరుణంలో వానాకాలంలో తరచూ వచ్చే జ్వరాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. వానాకాలంలో సర్వ సాధారణంగా ప్రజలు జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఇక ఈ భయానక పరిస్థితుల్లో వ్యాధులు ఈజీగా అటాక్ చేస్తూ ఉన్నాయి. వానాకాలంలో జ్వరం, జలుబు, శరీర ఉష్ణోగ్రతలు మారడం లాంటివి తరుచుగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కాలంలో దోమల వ్యాప్తి కూడా జబ్బులు వచ్చేందుకు దోహదం చేస్తూ ఉంటుంది.

కాబట్టి ఈ సమయంలో తల్లులు తమ ఆరోగ్య సంరక్షణ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. వారు కేవలం వారి గురించి మాత్రమే కాకుండా వాళ్ల బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. వానాకాలంలో తల్లులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.ఓ ప్రముఖ వైద్యుడు తల్లులు వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరిస్తూ… తల్లులు తప్పకుండా తమ ఆరోగ్యం కోసం ఐదు సూచనలు పాటించాలని పేర్కొన్నారు. అవేంటంటే..

చాలా రోజుల పాటు గర్భవతులు, చిన్న పిల్లల తల్లులు వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ప్రభుత్వాలు, వైద్యులు ఎటూ తేల్చలేదు. కానీ ప్రస్తుతం గర్భవతులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వం కూడా చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తుంది. దీంతో అందరూ తల్లులు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. మీరు వ్యాక్సిన్ వేసుకునే ముందు మీ గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇలా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల తల్లికీ, శిశువుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.వేసవికాలంలో ప్రతి ఒక్కరి బాడీలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఇక గర్భిణులు, బాలింతలు తల్లులలో అయితే పరిస్థితి మరింత దిగజారుతుంది. దీని ప్రభావంతో అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఇలా బాడీలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండేందుకు తరుచూ పానీయాలు తాగుతూ బాడీని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందువల్లే గర్భిణులు, బాలింతలు పానీయాలు తీసుకోవడంలో అధిక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

చిన్న పిల్లలు ఉన్న తల్లులు తప్పనిసరిగా రోజులో 2.5 లీటర్ల లిక్విడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం తీసుకునే పానీయాలలో నీరు, లేదా వేడి టీ, వేడి చాక్లెట్, వేడి సూప్ లాంటివి ఉన్నా పరవాలేదు. ఇలా తీసుకోవడం వల్ల మనలో తలనొప్పి, గొంతు తడారిపోవడం లాంటి సమస్యలు రావు. ఇలా పానీయాలు తీసుకోవడం కేవలం మీకు మాత్రమే కాదు. మీ కడుపులో ఉన్న బేబీని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బేబీ చుట్టూ తగినంత ఉమ్మ నీరు ఉండేలా చేస్తుంది. కావున గర్భవతులు తమ బాడీ డీ హైడ్రేట్ కాకుండా తరచూ పానీయాలు తీసుకుంటూ ఉండాలి.చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు.

కానీ వైద్యులు సూచించిన ప్రకారంగా తినేముందు తప్పనిసరిగా చూసుకోవాలి. మనం తినే ఆహారంలో విటమిన్లు ఏ మేర ఉన్నాయో సరి చూసుకోవడం వలన విటమిన్లు సరిగా లేకపోతే మనం విటమిన్లు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకునే వీలుంటుంది. విటమిన్ C అనేది మనలో ఇమ్యూనిటీని పెంచేందుకు సాయపడుతుంది. శ్వాస సమస్యలతో బాధపడుతూ ఉన్నపుడు సిట్రిక్ ఆమ్లాలు ఉండే పండ్లు, జ్యూస్ లు తీసుకోవడం చాలా మంచిది. మన చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన ఆహార పదార్థాలు పాడయ్యే ప్రమాదం ఉంది. కావున చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చూడండి. మరియు వంట చేసే ముందు కూరగాయలను నీటిలో బాగా కడగండి.

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామాల వలనే మన శరీరాలను రోగాల నుంచి కాపాడుకోవచ్చు. ఎన్ని పనులున్నా వ్యాయామాలు చేయడం మాత్రం మరిచిపోకూడదు. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో వ్యాయామాలు శరీరానికి చాలా అవసరం. కసరత్తులు చేయడం వీలు కాకపోతే కనీసం వాకింగ్ చేసినా సరిపోతుంది. వాకింగ్ చేసే ముందు కొన్ని విషయాలను గమనించాలి. వాకింగ్ చేయాలని నిర్ణయించుకున్నపుడు యాంటీ– స్కిడ్ ఫుట్ వేర్ను ధరించే విధంగా చూసుకోవాలి.

మరియు పొడి ప్రాంతాల్లో సాధ్యమైనంత ఎక్కువ సేపు నడిచేందుకు ప్రయత్నించాలి. అలా వీలు కాకపోతే మీ ఇంటి పరిసరాల్లో కూడా శుభ్రంగా ఉంటే నడవొచ్చు.ప్రస్తుత పరిస్థితుల్లో SMS పాటించడం చాలా అవసరం. SMS అంటే ఏదో మెస్సేజింగ్ పదమని చాలా మంది పొరపడుతారు. కానీ SMS అంటే శానిటైజేషన్, మాస్కు, సోషల్ డిస్టెన్స్. కావున తప్పని సరిగా ఈ కరోనా భయానక పరిస్థితుల్లో అందరూ ఈ రక్షణ సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి.

ఏదైనా సరే తినే ముందు శానిటైజర్, లేదా సబ్బుతో మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి.బయటకు వెళ్లే ముందు తప్పని సరిగా మాస్కు ధరించాలి. మాస్కు ధరించడం అంటే చాలా మంది ఏదో మొక్కుబడిగా ధరిస్తున్నారు. కానీ అలా కాకుండా మొత్తం నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కును ధరించాలి. ఇక మిగిలింది సోషల్ డిస్టెన్స్. ప్రస్తుత రోజుల్లో సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. చాలా మంది సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మహమ్మారి వ్యాప్తి కారణమవుతున్నారు. కానీ మనం ఏదేని పని మీద బయటకు వెళ్లినపుడు తప్పని సరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.