హీరో ధనుష్‌పై మండిపడ్డ హైకోర్టు

హీరో ధనుష్‌పై మండిపడ్డ హైకోర్టు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. లగ్జరీ కారు కొనుగోలు వ్యవహారంలో పన్ను మినహాయింపు అడగడం సరికాదంటూ మొట్టికాయలు వేసింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు మీకేంటి ఇబ్బంది? అంటూ సూటిగా ప్రశ్నించింది. చట్టం ముందు అంతా సమానులే అని పేర్కొంటూ.. పన్ను కట్టి తీరాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది.

2015 సంవత్సరంలో అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును కొనుగోలు చేశారు ధనుష్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కారుకు దిగుమతి సుంకం చెల్లించాలని అధికారులు ఆదేశించారు. దీంతో అదే ఏడాది ఆ కారుకు పన్ను మినహాయిపు కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ధనుష్. ఆయన ఈ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోట్ల విలువ చేసే కారు కొన్న మీరు టాక్స్ కట్టకుండా మినహాయింపు ఎలా అడుగుతున్నారంటూ ధనుష్ తీరును హైకోర్టు ఎండగట్టింది. సామాన్యులు సైతం అగ్గిపెట్టె, సబ్బు బిల్ల లాంటివి కొని కూడా పన్ను చెల్లిస్తున్నారు. అలాంటి డబ్బున్న మీలాంటి వీఐపీలకు పన్ను కట్టడంతో ఉన్న ఇబ్బందులు ఏమిటి? హీరోను నిలదీసింది.

ధనుష్‌ రియాక్ట్ అవుతూ.. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని సమాధానమిచ్చారు. రీసెంట్‌గా హీరో విజయ్‌కు సైతం కోర్టు నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. పన్ను కట్టనందుకు విజయ్‌కు లక్ష రూపాయల జరిమానా పడింది.