వర్మ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

వర్మ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో రూపొందుతోన్న ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా తమ కుమార్తె కథతో సినిమా తీయడమే కాకుండా తమను క్షోభకు గురిచేస్తున్నారని దిశ తండ్రి ఇప్పటికే కోర్టుకెక్కారు. ఈ సినిమా విడుదలను ఆపాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై కేంద్ర సెన్సార్ బోర్డును తెలంగాణ హైకోర్టు వివరణ కూడా కోరింది.

ఇదిలా ఉంటే ‘దిశ ఎన్‌కౌంటర్’ చిత్రాన్ని నిలిపి వేయాలని ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం వాదనలను విన్నది. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి హైకోర్టు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వ కుండా చేస్తున్నారని న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలియజేశారు.

అంతేకాకుండా, ఈ చిత్రంలో నిందితులను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కృష్ణమూర్తి కోర్టును కోరారు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు ఎలా చిత్రం తీస్తారని కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌లకు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.