రికార్డు స్థాయిలో కొత్త కేసులు

రికార్డు స్థాయిలో కొత్త కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. వైరస్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా బాగా పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో నాలుగు సార్లు 100కి పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి కారణం గాలి కాలుష్యమేనట. కొవిడ్‌ 19 రోగులు ఈ కాలుష్యమైన గాలిని పీల్చడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని.. దీంతో మరణాల రేటు పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ సోమవారం (నవంబర్ 23) అన్నారు.

తాజాగా మంగళవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కాలుష్యం వల్లే ఢిల్లీలో కరోనా మూడో దశలో పంజా విసురుతోందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని కాలుష్యాన్ని నివారించాలని కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేజ్రీవాల్ తెలిపారు. మూడో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీలో నవంబర్ 10న రికార్డు స్థాయిలో 8,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని ఆయన వివరించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 4454 కొత్త కేసులు నమోదు కాగా.. కొవిడ్ కారణంగా 121 మంది మరణించారని ఆయన వెల్లడించారు. టెస్టుల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. సోమవారం 37 వేల నమూనాలను పరీక్షించామని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వ హాస్పిటళ్లలో మరో 1000 ఐసీయూ బెడ్లు కేటాయించాలని ప్రధానిని సీఎం కేజ్రీవాల్ కోరారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు చేశారు.