భయపడుతున్న భాగ్య నగరం

భయపడుతున్న భాగ్య నగరం

నగరవాసుల్ని వర్షం భయం వెంటాడుతోంది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చార్మినార్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌, తార్నాక, నేరేడ్‌మెట్‌, మూసాపేట, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, ఎర్రగడ్డ, ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం పడుతోంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ స​మావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది ఆ తర్వాతి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు (సోమ, మంగళవారాల్లో) కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.