పెళ్లి రోజే ఆ ఇద్దరికీ ఆఖరి రోజు

పెళ్లి రోజే ఆ ఇద్దరికీ ఆఖరి రోజు

పెళ్లి చేసుకున్న గంటల్లోనే భార్యను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో సోమంజేరి గ్రామానికి చెందిన క్రేన్‌ ఆపరేటర్‌ నిధివాసన్‌ (27). ఇతనికి సమీప బంధువు సడయన్‌కుప్పం గ్రామానికి చెందిన సంధ్య(22)తో జనవరిలో వివాహం నిశ్చమైంది. జూన్‌ 10న వివాహం వైభవంగా నిర్వహించాలని అనుకున్నా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్ది మంది బంధువుల సమక్షంలో అదే రోజు సమీపంలోని ఆలయంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారు నగలు ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రి అంటూ భారీగానే కట్నకానుకలు ఇచ్చారు.

బుధవారం వివాహం పూర్తయిన తరువాత తొలిరాత్రికి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి రాత్రి 12 గంటల సమయంలో యువతి గట్టిగా కేకలు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బంధువులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మూడు గంటలకు యువకుడు నీధివాసన్‌ తలుపులు తెరుచుకుని, గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా యువతి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో కాట్టూరు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని పరిశీలించగా, గడ్డపారతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిధివాసన్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. వివాహమై 24 గంటలూ గడవక ముందే యువతి దారుణ హత్యకు గురి కావడం, యువకుడు సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది.