లష్కరే తొయిబా కమాండర్ ను మట్టుపెట్టిన భారత సైన్యం…!

Indian army killed Lashkar-e-Toiba commander...!
Indian army killed Lashkar-e-Toiba commander...!

ఏడురోజులుగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఎన్ కౌంటర్ జరగుతున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా జరుగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటికే పలువురు జవాన్లు అమరులయ్యారు. తాజాగా భారత భద్రతా బలగాలు లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్‌ కుమార్ ధ్రువీకరించారు.

కాల్పుల అనంతరం రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌ది అని వెల్లడించారు. అనంతనాగ్‌ జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలుపెట్టిన విషం తెలిసిందే. ఆ మరుసటి రోజు(సెప్టెంబర్‌ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది.

దీంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌లు అమరులయ్యారు. గత దశాబ్దకాలంలో సుదీర్ఘంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఇదేనని తెలుస్తోంది.