‘ఇండియన్‌ 2’ ప్రొడక్షన్‌ ఛాన్స్‌ దిల్‌ రాజుకు ఎలా వచ్చిందంటే..!

interesting news about dil raju on getting bharateeyudu movie production

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దాదాపు రెండు దశాబ్దాల క్రితం కమల్‌ హాసన్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా రికార్డులు బ్రేక్‌ చేసింది. తమిళంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు మరియు హిందీలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ప్రేక్షకులు భారతీయుడు సినిమాను మర్చిపోలేరు అంటే ఆ సినిమా సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో పేరుకు పోయిన అవినీతిపై ఒక వృద్ద స్వాతంత్య్ర సమరయోధుడు చేసిన యుద్దమే ‘భారతీయుడు’ సినిమా. ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని శంకర్‌ చాలా కాంగా ఎదురు చూస్తున్నాడు. అయితే అందుకు తగ్గ సరైన కథ సిద్దం కాలేదు. 

తాజాగా ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ అంటూ తెరకెక్కించబోతున్నట్లుగా శంకర్‌ ప్రకటించాడు. కమల్‌ హాసన్‌, శంకర్‌లతో తొగు నిర్మాత దిల్‌రాజు కలిసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. శంకర్‌ సినిమాలను ఎప్పుడైనా ప్రముఖ తమిళ నిర్మాతలు నిర్మిస్తుంటారు. కాని ఈసారి మాత్రం దిల్‌రాజుకు శంకర్‌ అవకాశం ఇచ్చాడు. అసలు శంకర్‌, కమల్‌లకు దిల్‌రాజుకు ఎక్కడ జోడీ కుదిరింది, వీరి ముగ్గురి జత కలవడం వెనుక ఏదైనా జరిగిందా అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దిల్‌రాజుకు ఇంత ప్రతిష్టాత్మక, భారీ బడ్జెట్‌ సినిమా నిర్మించే అవకాశం ఎలా వచ్చిందని సినీ వర్గాల వారు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తమిళ నిర్మాతలు కూడా దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చాడు అంటూ చర్చించుకుంటున్నారు. 

ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టింది దిల్‌రాజు కనుక, ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశంను శంకర్‌ దిల్‌రాజుకు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. దిల్‌రాజు ప్రొడక్షన్‌ ఆఫీస్‌లో రచయితలకు కొదవ లేదు. పదుల సంఖ్యలో నెలసరి జీతాలు ఇస్తూ దిల్‌రాజు వారితో కథలు రాయిస్తూ ఉంటాడు. తాజాగా దిల్‌రాజు రైటర్స్‌ టీం ఒక స్టోరీని సిద్దం చేశారు. అవినీతిపై యుద్దం చేసే ఒక వ్యక్తి స్టోరీని సిద్దం చేశారు. ఆ స్టోరీ కాస్త ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ కథలా ఉంది. ఆ కథను దర్శకుడు శంకర్‌ మరియు కమల్‌ హాసన్‌లకు దిల్‌రాజు వినిపించాడు. ఎప్పటి నుండి సీక్వెల్‌ కోసం మంచి కథ కోసం వెదుకుతున్న శంకర్‌కు ఆ స్టోరీ లైన్‌ బాగా నచ్చింది. ఆ స్టోరీలో మార్పులు చేర్పులు చేసి సీక్వెల్‌కు ప్లాన్‌ చేశాడు. ఈ కథను సిద్దం చేయించినందుకు దిల్‌రాజుకు శంకర్‌ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. అందుకు కమల్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ఇది అసలు మ్యాటర్‌. దిల్‌రాజుకు ఊరికే ఏమీ శంకర్‌ నిర్మాణ బాధ్యతలు అప్పగించలేదు. దాదాపు 200 కోట్లతో దిల్‌రాజు ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.