రద్దయిన అంతర్జాతీయ విమాన సేవలు

రద్దయిన అంతర్జాతీయ విమాన సేవలు

కరోనా లాక్‌డౌన్‌తో రద్దైన అంతర్జాతీయ విమాన సేవలు మరో నెల రోజుల పాటు తెరుచుకునే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడు ప్రారంభిస్తారనేది సందిగ్ధమే. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చినప్పటికీ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలను పొడిగించింది. యూరప్ దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుండటమే అందుక్కారణం. ముఖ్యంగా ఇటలీలో పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది.

అంత‌ర్జాతీయ క‌మర్షియ‌ల్ విమానాల రాక‌పోక‌ల‌పై ఇప్పటికే అమ‌ల్లో ఉన్న నిషేధాజ్ఞలను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ది డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (DGCI) బుధ‌వారం (అక్టోబర్ 28) ఒక ప్రకటన విడుదల చేసింది. యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైరస్ మ‌రోసారి వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రం అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ విమాన స‌ర్వీసుల‌ను అనుమ‌తిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ కార్గో స‌ర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. వీటితో పాటు కేంద్ర హోం శాఖ అనుమతించిన ప్రత్యేక విమాన స‌ర్వీసుల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని పేర్కొంది.

క‌రోనా వైరస్ కట్టడి కోసం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ ఏడాది మార్చి 23 నుంచి అంత‌ర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవసరమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి వీలుగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. కానీ.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధం పొడిగిస్తూ వస్తోంది. సెప్టెంబర్‌లో విధించిన అన్‌లాక్-5 నిబంధనలను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా డీజీసీఏ కూడా అంతర్జాతీయ విమాన సేవలపై మ‌రోసారి నిషేధాన్ని పొడిగించింది.