ఉద్యోగులను ఆఫీసులకు రప్పించండి

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించండి

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న ఉద్యోగులను సాధ్యమైనంత త్వరగా ఆఫీసులకు రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలను మరోసారి కోరింది. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించాలంటూ గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలను కోరుతూ వస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి టెన్షన్, థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కంపెనీలు ఇదే విధానాన్ని కొనసాగించాయి.

కరోనా థర్డ్ వేవ్ ముగిసిందంటూ ఇటీవలే తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు వచ్చేలా చూడాలని ఐటీ శాఖ మంగళవారం కంపెనీలను కోరింది.ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 6.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు.వారిలో ప్రస్తుతం ఆఫీసులకు వచ్చేవారు 10 శాతం లోపే ఉన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు సాధారణమవడం, ప్రభుత్వ సూచనలపై స్పందించిన ఐటీ కంపెనీలు ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 3 నుంచి మేనేజర్‌, ఆపై స్థాయి ఉద్యోగులంతా వారంలో రెండ్రోజులు ఆఫీసులకు రావాలని ఇప్పటికే విప్రో ఉద్యోగులను కోరినట్లు సమాచారం.