Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్విట్టర్ వేదికగా పార్టీని నడుపుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్ ఇప్పుడు సొంతంగా పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని టీడీపీ మంత్రులు అనడం సంతోషమంటూ ఓ ట్వీట్ చేసిన పవన్… భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఓ స్పష్టత ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా బరిలో దిగాలని పవన్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం ఇందులో భాగమే అన్న వాదన వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ పర్యటన గురించి జనసేన మీడియా వ్యవహారాల ఇన్ చార్జ్ హరిప్రసాద్ వెల్లడించారు. పవన్ ఇకపై నిరంతంర ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎవరితో పోత్తు పెట్టుకోవాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటానికి తమతో కలిసి వచ్చే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలే అని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. త్వరలోనే పవన్ ప్రజాయాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్తారని, ప్రజా సమస్యల పరిష్కారమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు. పాదయాత్ర లేదా బస్సు యాత్ర రూపంలో ప్రజాయాత్ర సాగుతుందని తెలిపారు.
జనసేన అజెండా… ప్రజాసమస్యలను పరిష్కరించడమే అని, ప్రభుత్వ నిర్ణయం ప్రజామోదమైతే ఆమోదిస్తామని లేకపోతే పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతో అయినా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జన సైనికులకే 60శాతం సీట్లు ఇస్తామని, పార్టీకోసం పనిచేసే వారందరికీ జనసేన సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తానికి ఈ ప్రకటన ద్వారా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి దూరం జరుగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. మంత్రుల వ్యాఖ్యలను ట్విట్టర్ లో పవన్ ప్రస్తావించినప్పుడు జరగబోయేది ఈ పరిణామమే అని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే… ప్రజాయాత్రతో పవన్ జనసేనను ఎన్నికల యుద్ధానికి సిద్ధంచేస్తున్నారు.