హంతకులపై పగబట్టిన హీరోయిన్

హంతకులపై పగబట్టిన హీరోయిన్

టైమ్‌ మనదైతే మంచి మంచి అవకాశాలన్నీ మనకే వస్తాయి. మంచి జరిగినప్పుడు చాలామంది అనుకునే మాట ఇది. ఇప్పుడు కృతీ సనన్‌ కూడా ఇలానే అనుకుంటున్నారు. ప్రభాస్‌ చేస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు కృతీ సనన్‌. ఇప్పుడు మరో మంచి చాన్స్‌ ఆమె ఖాతాలో పడిందని సమాచారం. హాలీవుడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌ ‘కిల్‌ బిల్‌’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం కృతీకి దక్కిందట. క్వెంటిన్‌ టరంటినో దర్శకత్వంలో రూపొందిన ‘కిల్‌ బిల్‌’లో ఉమా థుర్మన్‌ కథానాయికగా నటించారు.

హిందీ రీమేక్‌లో ఆ పాత్రకు కృతీ సనన్‌ని ఎంపిక చేశారట సినిమా హక్కులు కొన్న నిర్మాత నిఖిల్‌ ద్వివేది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో హంతకులు ‘బిల్‌’ని, అతని మనుషులనూ చంపడమే ధ్యేయంగా కథానాయిక ప్లాన్‌ చేస్తుంది. హంతకులపై పగబట్టిన భయంకరమైన మహిళగా ఉమా థుర్మన్‌ అద్భుతంగా నటించారు. కృతీ కూడా తనదైన శైలిలో ఈ పాత్రను చేయడానికి రెడీ అవుతున్నారట. యాక్షన్‌ మూవీ కాబట్టి ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆమె శిక్షణ తీసుకోనున్నారని సమాచారం.