హైదరాబాద్ వాసులకు కేటీఆర్ శుభవార్త

ktr-is-good-news-for-hyderabadi-people

హైదరాబాద్ మెట్రో సర్వీస్‌కు సంబంధించిన మరో శుభవార్త చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తున్న మెట్రో రైలును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించడానికి కసరత్తులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు.

మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే రాయదుర్గం స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు తర్వలోనే ప్రారంభమవనున్నాయని అంటున్నారు.

మైండ్‌స్పేస్‌ చౌరస్తా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకూ ఉన్న 30.7 కి.మీ. దూరంలో ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్ ప్రయాణిస్తుంది. ఇప్పటికే ఈ రూట్‌పై ఢిల్లీ మెట్రో రైలు సంస్థ పూర్తి నివేదికను రూపొందించింది.

అయితే ఇది ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కాబట్టి స్టేషన్‌ల సంఖ్య తక్కువగా ఉండనుంది. మొత్తం 30.7 కి.మీ. పరిధిలో కేవలం 9 స్టేషన్లు మాత్రమే ఏర్పాటు చేస్తారు. రాయదుర్గం, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఎయిర్‌పోర్టు వరకు ఈ మెట్రో మార్గం ఉంటుంది.

72 కి.మీ. పరిధితో ప్రతిపాదించిన మెట్రో లైన్‌లో ప్రస్తుతం 54 కి.మీ. వరకే వాడుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. కేపీహెచ్‌బీ నుంచి గచ్చిబౌలి వరకు ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.