ప్రేమ….సూసైడ్ అటెంప్ట్….అబ్బాయి మృతి….చావుబతుకుల మధ్య అమ్మాయి

lovers suicide attempt

తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోననే ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రేమికుడు ప్రాణాలు కోల్పోగా ప్రియురాలు మృత్యువుతో పోరాడుతోంది. నల్గొండ జిల్లా పియోపల్లికి చెందిన సందీప్‌ రెడ్డి(27) ఎంఫార్మసీ చేశాడు. మూడు నెలల క్రితం ముంబయిలో ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పి హైదరాబాద్ చైతన్యపురిలో అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. సందీప్‌కు బంధువైన దామరచర్లకు చెందిన యువతి(22) దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఇద్దరికీ చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో అది కాస్తా ప్రేమగా మారింది. అయితే ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే పెద్దలు అంగీకరిస్తారో? లేదో? అన్న అనుమానం కలిగిన వారు పెద్దలు తమను విడదీస్తే ఒకరిని విడిచి ఒకరం ఉండలేమన్న ఆందోళనతో కూల్‌డ్రింకులో గుళికల మందు కలుపుకుని తాగేశారు. చుట్టుపక్కల వారు వీరిని గమనించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సందీప్ మృతిచెందగా.. యువతి ప్రాణాలతో పోరాడుతోంది.  తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న ఆందోళనతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఇద్దరి సమాధి ఒకే దగ్గర కట్టాలన్నదే తమ చివరి కోరికంటూ వారు రాసిన లేఖను పోలీసులు సంఘటనా స్థలం నుంచి సేకరించారు.