మహేష్బాబు 25వ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది. మూడు నెలల క్రితమే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రంపై కోర్టుకు వెళ్లడంతో షూటింగ్కు స్టే రావడం జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి తన డబ్బుతో రెడీ చేసిన కథను ఇప్పుడు దిల్రాజు, అశ్వినీదత్లు కలిసి నిర్మిస్తున్నారు అని, తన నిర్మాణంలో నటించాల్సిన మహేష్బాబు హ్యాండ్ ఇచ్చాడు అంటూ నిర్మాతల మండలిలో మరియు కోర్టులో ఫిర్యాదు చేసిన పీవీపీతో రాజీ కుదిరింది. షూటింగ్ ప్రారంభించేందుకు పీవీపీ ఓకే చెప్పాడు. కోర్టులో పెట్టిన కేసును విత్డ్రా చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. పీవీపీని ఒప్పించేందుకు దాదాపు అయిదు కోట్ల డీల్ కుదిరినట్లుగా సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత ప్రసాద్ వి పొట్లూరికి దర్శకుడు 1.5 కోట్లు, మహేష్బాబు ఒక కోటి, నిర్మాతలు 2.5 కోట్లను ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. తన బ్యానర్లో చేయనందుకు మహేష్బాబు, వంశీ పైడిపల్లిలు తనకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అంటూ పీవీపీ డిమాండ్ చేయడంతో ఈ మొత్తంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా కోసం కనీసం కోటి అయినా ఖర్చు చేశాడో లేదో కాని పీవీపీ ఏకంగా అయిదు కోట్ల రూపాయలను దక్కించుకున్నాడు. మహేష్బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు నిర్మాతలు దిల్రాజు, అశ్వినీదత్లు కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ 25 మూవీకి అడ్డంకులు తొలగి పోవడంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.