పెళ్లి కొడుకు పై దాడి చేసి…అమ్మాయిని భుజాన వేసుకుని కిడ్నాప్ !

Bright Groom Kidnaped By Parents In Nizamabad

మరో ఐదు నిమిషాల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్న ప్రేమజంటను సినీ ఫక్కీలో విడదీశారు అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు. పెద్దలను కాదని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటపై దాడి చేసి అమ్మాయిని సొంత భందువులే కిడ్నాప్ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అందుతున్న వివరాల మేరకు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మక్లూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సౌజన్యలు మూడేళ్ళుగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహరం సౌజన్య కుటుంబసభ్యులకు తెలిసింది. సౌజన్యను మందలించారు.

అయితే తమ పెళ్ళికి కుటుంబసభ్యులు ఒప్పుకోని కారణంగా ప్రాణదీప్, సౌజన్యలు బుధవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు. ప్రాణదీప్ స్నేహితులు వారికి అన్ని విధాల సదుపాయాలూ ఏర్పాటు చేశారు. ఆర్యసమాజ్‌లో మరికొద్దినిమిషాల్లోనే వివాహం జరగాల్సి ఉండగా విషయం తెలుసుకున్న సౌజన్య బంధువులు పెద్ద ఎత్తున ఆర్యసమాజ్ కు చేరుకొన్నారు. సౌజన్యతో పాటు ప్రాణదీప్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ప్రాణదీప్‌కు గాయాలయ్యాయి. తానూ రానని చెప్తున్నా వినకుండా సౌజన్యను కుటుంబసభ్యులు దాడి చేస్తూనే టూ వీలర్‌పై తీసుకెళ్ళారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రాణదీప్ నిజామాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. తాము ఇద్దరం మేజర్లమని తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రియుడు పోలీసులని కోరాడు.