అత్తపై కోపం పెంచుకున్న అల్లుడు

అత్తపై కోపం పెంచుకున్న అల్లుడు

కూతురిని కాపురానికి పంపించడం లేదని అత్తపై అల్లుడు కోపం పెంచుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా పంపడం లేదని ఆవేశంలో అత్తింటికి వెళ్లి ఆమెను పొడిచేశాడు. అడ్డొచ్చిన బావమరిదిపై కూడా దాడి చేశాడు. అత్తను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశానికి గురైన అల్లుడు అత్తను హతమార్చి చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు..

కర్నూలు పాతబస్తీ ఏరియా బండిమెట్టకు చెందిన మహబూబ్‌బాషాకి బంగారుపేటకి చెందిన మున్నీరాబీ కూతురు మెహమ్ముదాతో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. చెడువ్యసనాలకు బానిసగా మారిన బాషా నిత్యం మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. కూతురు బాధ చూడలేక మున్నీరాబీ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లింది. తన భార్యను తిరిగి కాపురానికి పంపాలంటూ అత్తతో బాషా గొడపడేవాడు.

పలుమార్లు అడిగినా అత్త తన కూతురిని పంపించేందుకు నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. 2015 అక్టోబరు 14న బంగారుపేటలోని అత్తింటికి వచ్చి కత్తితో మున్నీరాబీని పొడిచేశాడు. అది గమనించిన ఆమె కొడుకు అడ్డురావడంతో అతనిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన మున్నీరాబీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచింది.

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదు విధించింది. క్షణికావేశంలో చేసిన తప్పునకు జీవితాన్ని బలి చేసుకోవాల్సి వచ్చింది.